IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం.. భారీ వర్షాలు..! భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు..
Rain Alert : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ మండుటెండల్లోను చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, నిర్మల్, మెదక్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక విషయంలో వెళ్తే..
ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడతున్నాయి. మొత్తంగా వాతావరణం చల్లగా మారిపోయింది. అయితే మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండ్రోజులు వర్షాలు మరింత జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లు, ఉరుములు మెరుపులు తోడవడంతో ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది. ఇక రాగల రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక ఇవాళ (మార్చి 20, శుక్రవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట… అందుకే ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
తెలంగాణలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది… ఇవాళ (మార్చి 20, గురువారం) సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు పడే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయంటోంది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి… దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక ఈ సాయంత్రం జాగ్రత్త…
ఇక ఇవాళ హైదరాబాద్ లో ఆకాశం మేఘాలతో కమ్ముకుని ఉంటుందని.. సాయంత్రం లేదా రాత్రివేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయట. ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయి కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
ఏపీపై ద్రోణి ఎఫెక్ట్… వర్షాలే వర్షాలు
ఇక మన పొరుగు రాష్ట్రాం ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే రానున్న మూడు రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఇవాళ (మార్చి 20, గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తు సంస్థ తెలిపింది. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించింది.