FILM : దసరా బరిలోకి ముగ్గురు స్టార్లు.. పండుగ సీజన్లో భారీ వసూళ్లపై ట్రేడ్ ఆశలు.. బాక్సాఫీస్ వేటకు బడా హీరోలు
ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం జరగబోతోంది. ఇండియన్ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు.. తమ భారీ చిత్రాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్కు తెరలేవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ స్టార్ హీరోలు ఎవరు? ఏ సినిమాలతో పోటీకి దిగుతున్నారు? తెలుసుకుందాం.

ఈ అక్టోబర్లో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సమరం జరిగేలా కనిపిస్తోంది. దసరా సీజన్ను టార్గెట్ చేస్తూ ముగ్గురు స్టార్ హీరోలు తమ భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో అక్టోబర్ బాక్సాఫీస్ పోరు ఈ ఏడాదిలోనే అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రేసులో ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ నిలిచింది. బ్లాక్బస్టర్గా నిలిచిన జైలర్ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక అదే సమయంలో టాలెంటెడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ‘ఓం: చాప్టర్ వన్’ కూడా విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. విభిన్నమైన కథలను ఎంచుకునే ధనుష్ ఈసారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. దీంతో రజినీకాంత్, ధనుష్ సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఇక ఈ పోరును మరింత హైప్ చేసే సినిమా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో భారీ విజువల్ స్కేల్తో రూపొందుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంపై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కూడా అక్టోబర్లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ మూడు సినిమాలు దసరా సీజన్లోనే విడుదలైతే.. బాక్సాఫీస్ వద్ద అసలైన త్రిముఖ పోరు చూడొచ్చు. థియేటర్ల కేటాయింపు నుంచి కలెక్షన్ల వరకు గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే పండుగ సీజన్ కావడంతో ప్రేక్షకుల ఆదరణ కూడా భారీగానే ఉండే అవకాశముంది. దీంతో ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో బాక్సాఫీస్ కింగ్గా ఎవరు నిలుస్తారన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.