ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక భేటీలు.. ఏపీ అభివృద్ధికి కొత్త దిశ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ బిజీ బిజీగా మారింది. హైదరాబాద్ లో ప్రధాని మోడీని కలిసిన ఆయన అనంతరం ఢిల్లీకి పయనమయ్యారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, కేంద్ర సహాయంపై దృష్టి సారించిన ఆయన, ఈ పర్యటనలో పలువురు కీలక నేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్లతో ముఖ్యమంత్రి సమావేశమై, ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించనున్నారు. అదేవిధంగా, మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో జరిగే భేటీలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటు పై చర్చ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధాన ఘట్టంగా సాయంత్రం జరిగే సీఐఐ బిజినెస్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. ఈ వేదిక ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మరియు పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ఈ వరుస భేటీలతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లోనూ మరియు అభివృద్ధి దిశగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.