It has been seven years since the Pulwama attack in Jammu and Kashmir..!

Pulwama Attack : పుల్వామా ఎటాక్ కి ఏడేళ్లు పూర్తి..! అమరులను తలుచుకుంటున్న భారత్..

తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబడి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. సరిగ్గా ఏడేళ్ల కిందట జరిగిన ఆ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే సారి 40 మంది జవాన్లను కోల్పోయాం. ఈ ఘటనతో భారత్ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన పాక్ ఉగ్రమూకల భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ.

ఇక విషయంలోకి వెళ్తే..

ఫిబ్రవరి 14.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా ఉదయం నుంచి యువతలో ఆ సంబురాలు మిన్నంటాయి. కానీ సాయంత్రం అయ్యే సరికి యావత్ దేశం మొత్తం ఉలిక్కి పడింది. చిన్న , పెద్ద, ముసలి, ముతక, ముఖ్యంగా ప్రేమికులు అందరు ఉలిక్కి పడ్డారు. ఆ రోజు జరిగిన పాక్ ఉగ్రదాడి భారత దేశం పాలిట ఒక చీకటి రోజుగా మారిపోయింది. అందుకే ప్రపంచ మొత్తం ఫిబ్రవరి 14న ప్రేమికులు దినోత్సవం చేసుకుంటే.. ఒక్క భారత్ మాత్రమే బ్లాక్ డేగా జరుపుకుంటుంది. ఆ రోజు పాక్ చేసిన విధ్వంసం భారత్కు బ్లాక్ డేగా మిగిలిపోయింది. 2019లో ఇదే రోజున జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి ఏడేళ్లు పూర్తి అవుతుంది.

అసలు ఆ రోజు ఏం జరిగింది..?

జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే రోజున పుల్వామ అటాక్ పాకిస్థాన్ ఉగ్రవాదులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో CRPF కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ 44 జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపుగా 2500 మంది సైనికులతో 78 బస్సులు వెళ్తున్న సమయంలో 5వ బస్సుపై ఈ దాడి జరిగింది. దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ దాడి తర్వాత అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతిదాడి చేశారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ప్రాణాలు తీశారు.
ఇక ఈ ఆత్మహుతి దాడిలో పాల్గొన్నది పాకిస్తాన్ వాది కాదు.. భారత దేశానికి చెందిన ఒక కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్. ఆ ఉగ్రవాది కూడా ఈ ఘటనలో పిసులు పిసులు అయ్యాడు. ఇక ఈ పుల్వామా ఘటనకు రెండేళ్ల క్రితమే అతను జైషే మహ్మద్లో చేరాడు. ఆత్మాహుతి బంబార్ ఆదిల్ అహ్మద్ దార్ని పోలీసులు వివిధ కేసుల్లో 6 సార్లు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీసారి పోలీసులు హెచ్చరించి వదిలేశారు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్.. తన కారును జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు పక్క నుంచి ఎడమవైపునకు ప్రవేశించాడు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

జైషే మొహమ్మద్ సంచలన ప్రకటన..!

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది.. మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ప్లాన్‌లో భాగంగా ఆత్మాహుతి దాడికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే ఉగ్రవాది అదిల్ పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోకి దూరి ఐదో బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడం వారి మరింత అనుకూలించింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో( Pulwama Attack Revenge) 10మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ దాడి బాధ్యతవహిస్తూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత రగిలిపోయింది.

12 రోజుల్లో భారత్ రివెంజ్..!

పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. అందుకు మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఎంచుకుంది. ఇక ఈ ఘటన జరిగిన 12 రోజులు తర్వాత, అంటే ఫిబ్రవరి 25, 2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ ఛౌధురీ 2020లో జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేటతెల్లమయ్యింది. ‘భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం.. పుల్వామాలో విజయం సాధించాం. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ విజయం సాధించింది. మనమంతా ఆ విజయంలో భాగస్వాములం’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విషయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమార్ బజ్వా వణికినట్లు అప్పటి ప్రతిపక్ష ఎంపీ అయాజ్‌ సాధిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్ధమాన్‌ను విడుదల చేయకపోతే భారత్‌ తమ దేశంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఖురేషీ చెప్పడంతో బజ్వా కాళ్లు వణికినట్లు అయాజ్‌ పార్లమెంట్ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *