BJP MLA Harish Babu Hunger Strike

GO 49 : జీవో రద్దు చేయండి.. BJP MLA పాల్వాయి హరీష్ బాబు డిమాండ్..!

తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో.. కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు దీక్ష చేపట్టారు. కుమ్మం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్‌ పట్టణంలో తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాల్సిందే..!

జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా, శాస్త్రీయమైన పద్ధతిని అనుసరించకుండా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ బాబు మండిపడ్డారు. గత మే 30న ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన జీ.ఓ. నెంబర్ 49 ను తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని పేర్కొన్నారు. తడోబా రిజర్వు ఫారెస్ట్ ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో కలుపుతూ కొమరం భీం అసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ పరిధిలోని 334 గ్రామాలను రిజర్వు ఫారెస్ట్ గా పేర్కొంటూ తీసుకువచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదు అన్నారు. ప్రభుత్వం దిగొచ్చే.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేసేంతవరకు బీజేపీ పోరాటం సాగుతుందని హరీష్ రావు స్పష్టం చేసారు. ఈ విషయంలో ఎంత వరకైనా వెళ్తామన్నారు.

మే 30న జీవో అమలు..

ఇక 30 మే 2025న ఈ జీవోను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు, తెలంగాణని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు మధ్య కొమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్‌ను ఏర్పాటు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ జీవో అమల్లోకి వస్తే కొమ్రంభీం ఆసిఫాబాద్‌ కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్‌ సిర్పూర్‌,కర్జెల్లి, బెజ్జూరు, పెంచికల్‌ పేట పరిధిలోని 3 లక్షల ఎకరాలు ఈ కారిడార్‌లోకి వెళ్లిపోతాయి. దీంతో జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని గిరిజనులు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే హరీష్‌ దీక్ష చేపట్టారు.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *