Robot welcomes Tollywood heroes at Telangana Global Summit

Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.

సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ నటుడు నాగార్జున, దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన ప్రముఖులను ‘రోబో’ ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది.

ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సు నేడు, రేపు కొనసాగుతుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడకి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఈ సదస్సులో వివరిస్తారు.