Musi River : తెలుగు రాష్ట్రాలపై ‘మొంథా’ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఇక జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండాల తలపిస్తున్నాయి. ఇక ఈ భారీ తుఫాన్ కారణంగా.. జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద మూసీ నది పొంగిపొర్లుతుంది. మూసీ ఉదృతంగా ప్రవహించడంతో.. పోచంపల్లి- బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బీబీనగర్, భువనగిరికి వెళ్లే వాహనదారులు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. మూసీ ఉధృతితో.. పోచంపల్లి- బీబీనగర్ ఇరు వైపులా అధికారులు భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరించవద్దని మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, MRI గుత్తా వెంకట్ రెడ్డి సూచించారు.
7 గేట్లు ఎత్తి నీటి విడుదల..
ఇక నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు 3, 4, 5, 6, 8, 10, 12 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.