రష్యా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత్ లో వివిధ ప్రధేశాలను సందర్శించారు. ఇక అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల ఒత్తిడుల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ మధ్య ఉన్న అసాధారణమైన స్నేహబంధాన్ని, బలమైన నమ్మకాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం ఢిల్లీకి చేరుకున్న పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. పుతిన్ కోసం ప్రధాని మోదీ ప్రొటోకాల్ను పక్కనపెట్టి మరి ప్రెసిడెంట్ కి స్వాగతం పలికారు. విమానం దిగిన వెంటనే ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, ఇద్దరూ ఒకే వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ దృశ్యం, కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి మించి ఇరువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి, పరస్పర విశ్వాసానికి నిలువుటద్దంగా నిలిచింది.
ఆప్త మిత్రుణ్ణి ఆలింగనం.. చేసుకున్న మోదీ

భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్ఘాట్ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.
హైదరాబాద్ హైస్ లో చర్చలు..

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్లో అధికారిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.