
ఈ ప్రపంచంలో… మానవ మేధస్సుకు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు. అవును… కానీ టెక్నాలజీ ద్వారా సాధ్యమైన కొన్ని ఘనతల్లో రోబోలు కూడా ఒకటి. ఇప్పుడు మరమనుషులు దాదాపు అన్ని పనులు చేస్తున్నారు. సాధారణమైన మనుషులు చేయలేని పనులు సైతం ఇట్టే చేసేస్తున్నారు. వంటలు వండటం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊర్చడం, కారు నడపడం, ఇంకా చెప్పాలంటే, ప్రస్తుత టెక్నాలజీతో ఆపరేషన్లు సైతం చేసేస్తున్నాయి. తాజాగా రోబోలతో శాస్త్రవేత్తలు మరో ఘనత సాధించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా…
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనాలో రోబోలతో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. చైనా మీడియా గ్రూప్ వరల్డ్ రోబోటిక్ కాంపిటీషన్ సిరీస్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. మిషా ఫైటింగ్ సిరీస్.. పేరుతో నిర్వహించిన పోటీల్లో రోబోల బ్యాటరీ, ఇతర మెటీరియల్కు పరిమితులు విధించారు. ప్రత్యేకమైన ఈ టోర్నమెంట్లో నలుగురు మానవ ఆపరేటర్లు జట్లుగా ఏర్పడి.. రోబోలకు మార్గనిర్దేశం చేశారు. వేగవంతమైన పరిస్థితులలో రోబోల అధిక పీడన సామర్థ్యాలను, వాటి స్థితిస్థాపకతను పరీక్షించడానికి, చైనా ఏఐ శక్తిసామర్థ్యాల ప్రదర్శనకు ఈ పోటీ ఒక వేదికగా నిలిచింది. ఈ పోటీల్లో… జీ1, హెచ్1 అనే రెండు హ్యూమనాయిడ్ రోబోలను బాక్సింగ్ రింగ్ లోకి దించారు. ఇందులో జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా… హెచ్1 రోబో ఎత్తు 5.11 అడుగులుగా ఉంది. రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.
గెలుపు ఎవరిదంటే..?
దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను చైనాకు చెందిన టెక్ సంస్థ యూనిట్రీ విడుదల చేసింది. ఇక బాక్సింగ్ రింగ్ లోకి దిగిన రోబోలు రెండు ఒకదానిపై ఒకటి పంచులతో విరుచుకుపడ్డాయి. రోబోలు కూడా అచ్చం మనుషుల్లానే పిడికిలి బిగించి కిక్కులు ఇవ్వడమే కాక, కాళ్ళతో కూడా తన్నుకున్నాయి. ఇక చివరగా… ‘యునిట్రీ రోబోటిక్స్’ సంస్థ తయారు చేసిన 1.32 మీటర్ల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్ రోబో.. బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది.